ENVIRONMENTAL/CLIMATIC NEWS

*ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* ' *వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - నివారణా చర్యలపై అవగాహన కరపత్రం ఆవిష్కరణ* ...'

By NANDURI VENKATESWARLU • 2026-07-23 07:27 • 3 views   Share WhatsApp Share Facebook Share X
*ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*  ' *వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - నివారణా చర్యలపై అవగాహన కరపత్రం ఆవిష్కరణ* ...'

తేదీ: 22-07-2026:"వ్యాధికి చికిత్సకన్నా నివారణమిన్న, మరియు ఇలాంటి కరపత్రాల వలన వ్యాధులపట్ల అవగాహన పెరుగుతుంది*" అని డాక్టర్ సుధాకర్ బండారి అన్నారు.

ఈరోజు ఉదయము వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు మరియు వాటి నివారణ చర్యలపై ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన కరపత్రాన్ని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆవిష్కరణ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుధాకర్ బండారి (ఇంచార్జ్ సూపరింటెండెంట్) లు కరపత్రాన్ని ఆవిష్కరించి, ఈ సందర్బంగా మాట్లాడుతూ, *మనకున్న ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వంటి మూడు కాలాలలో వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాధులు (సీజనల్ డిసీజెస్) ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధులతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్ వేరియంట్ లాంటి వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. మానవుడు జీవితంలో తను అనుకున్నది సాధించాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కావున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొన్నచో మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంటుంది. మనం తినే ఆహారము సరైన వేళలలో తీసుకోవడం మంచిది. వీలైనంతవరకూ బయటి ఆహారాన్ని వినియోగించడం మానాలి.* *ఆహారాన్ని, ఆహార పదార్థాలను తగు పాళ్ళలో ఉడికించి, వేడి పదార్థములనే తినాలి. ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ వంటి వాటిని పరిశుభ్రంగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం చాలా మంచిది.* *నాణ్యతా ప్రమాణాలను పాటించే కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆహార పదార్థాలపై ఈగలు, బొద్దింకలు వంటి కీటకాలు వాలకుండా చూసుకోవాలి. భోజనానికి ముందు ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగ ఉంచుకోవాలి. కాచి చల్లార్చి వడపోసిన మంచి నీటినే త్రాగాలి. ఇంటి ఆవరణలో మరియు బయటి పరిసరాలలో మురుగునీరు లేదా వర్షపునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొన్న యెడల మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంటుంది.* ' *_ఆరోగ్యమే మహాభాగ్యం_ 'కావున ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి* అని అన్నారు. అలాగే " *నిత్యము వ్యాయామము, నడక, ఆసనాలు, ధ్యానం మొదలైనవి పాటించడంతో పాటు పౌష్టికాహారం, తృణధాన్యాలు మరియు ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. బయటికి వెళ్ళినపుడు మాస్కును ధరించడం మంచిది"* అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో RMO డాక్టర్ విజయకుమారి మరియు ఫ్రెండ్స్ వెల్ఫెర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి తాటిచర్ల వరలక్ష్మి, G V రావు, పాలం శ్రీను, కొక్కుల జనార్దన్, విష్ణుప్రసాద్, శ్రీమతి అనూష, కొవ్వూరి తదితరులు పాల్గొన్నారు.

NANDURI VENKATESWARLU 0 followers