April 16, 2026

Fake Reporter Threatens Shop Owner with Knife, Collects ₹42,000 via PhonePe Accused Arrested by Vemulawada Town Police, Remanded by Court

విలేకరి ముసుగులో వసూళ్లు… కత్తితో బెదిరించి ₹42 వేల దోపిడీ
వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

వేములవాడ: జర్నలిస్టుగా నటిస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని వేములవాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తితో బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ.42 వేల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని వేములవాడ పట్టణంలోని ఒక సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు ప్రచురిస్తానని చెప్పి బాధితుడిని భయభ్రాంతులకు గురిచేశాడు.

అంతేకాకుండా కత్తితో ప్రాణహాని కలిగిస్తానని హెచ్చరించి, ఫోన్‌పే ద్వారా బాధితుడి నుండి రూ.42,000 వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధింపులకు పాల్పడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ఈ సందర్భంగా సీఐ బి. వీర ప్రసాద్ మాట్లాడుతూ, మీడియా లేదా అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. అలాగే నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION