కొరుట్ల:
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ (హీట్ స్ట్రోక్) బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కొరుట్లలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రేగొండ రాజేష్ సూచించారు. వడదెబ్బ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉన్నందున దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.
వడదెబ్బ అంటే ఏమిటి?
శరీర ఉష్ణోగ్రత 104°F (40°C) దాటినప్పుడు వడదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితిలో మెదడు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
లక్షణాలు:
తలనొప్పి, వాంతులు, తలనిర్భంధం
గుండె దడ పెరగడం
తీవ్ర నీరసం, రక్తపోటు తగ్గడం
తీవ్ర పరిస్థితుల్లో అయోమయం, స్పృహ కోల్పోవడం లేదా ఫిట్స్ రావడం
నివారణ చర్యలు:
మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 5:00 వరకు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి.
వదులుగా ఉండే కాటన్ దుస్తులు, లైట్ కలర్ బట్టలు ధరించాలి.
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా తల కప్పుకునే వస్త్రం ఉపయోగించాలి.
శరీరంలో నీటి శాతం నిలుపుకోవడానికి ORS, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి పానీయాలు తీసుకోవాలి.
కార్బోనేటెడ్ పానీయాలు, అధిక మసాలా ఆహారం మరియు జంక్ ఫుడ్ను పరిమితంగా తీసుకోవడం మంచిది.
రైతులకు సూచనలు:
రైతులు తమ వ్యవసాయ పనులను ఉదయం 11 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత చేయడం మంచిదని సూచించారు. పనులకు వెళ్లేటప్పుడు తగినంత నీరు, ORS తీసుకెళ్లాలని తెలిపారు.
ప్రథమ చికిత్స:
వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలి.
గాలి తగిలేలా చూడాలి మరియు బిగువైన దుస్తులు సడలించాలి.
చల్లటి నీటితో శరీరాన్ని తుడవాలి.
ఆలస్యం చేయకుండా సమీప వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి.