జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల”ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల సేవలు, పార్టీ కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం, నాయకత్వ లక్షణాలు మరియు అంకితభావానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి.
పార్టీ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులతో పాటు, వారితో సమన్వయం చేసే 21 మంది సభ్యులు ఉంటారు.
ఈ కమిటీలకు పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించగా, మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు పార్టీ తెలిపింది.
కమిటీలు సేకరించిన సమాచారాన్ని పార్టీ నాయకత్వం పరిశీలించిన అనంతరం, వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి నాయకత్వ అభివృద్ధి మరియు కార్యకర్తల పనితీరును అంచనా వేయడం లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ పేర్కొంది.