ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు.
భాస్కరరావు పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్లోని నివాసంలో ఉంచనున్నారు. గురువారం పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, చెన్నారెడ్డి మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1989లో తెనాలి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
నాదెండ్ల భాస్కరరావు మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది.