హైదరాబాద్, ఏప్రిల్ 22:
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో ఈ సంవత్సరం మార్చి నెల ప్రారంభం నుంచే ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ముందుగానే సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజుల పాటు సెలవులు ఉంటాయి.
జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే రోజున 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
వేసవి సెలవులు ప్రకటించడంతో పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగానే సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే, సెలవులకు ముందు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకూడదని సూచించింది.
అలాగే వేసవి సెలవుల్లో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువులు వంటి నీటి ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.