ప్రజా భద్రత అంశాలపై డీజీపీ, రవాణా శాఖ కమిషనర్తో ఎమ్మెల్సీ అంజిరెడ్డి భేటీ అక్రమ బంపర్ల తొలగింపు, క్రైమ్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్త
హైదరాబాద్, మే 21 : పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తిని కలిసి ప్రజా భద్రత, శాంతిభద్రతలు, క్రైమ్ నియంత్రణ మరియు రోడ్డు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు.
పోలీస్ స్టేషన్లలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బాధితులు నేరుగా ఫిర్యాదులు చేసే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని, కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదు డ్రైవ్ నిర్వహించాలని ప్రతిపాదించారు.
రోడ్డు భద్రత అంశంపై స్పందిస్తూ, మోటారు వాహనాల చట్టం-1988కు విరుద్ధంగా వాహనాలకు అమర్చుతున్న అక్రమ బంపర్లు (క్రాష్ గార్డులు) తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బంపర్ల కారణంగా పాదచారుల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని, ప్రమాదాల సమయంలో ఎయిర్బ్యాగ్ల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ వాహనాల నుంచే అక్రమ బంపర్ల తొలగింపు చర్యలు ప్రారంభించాలని సూచించారు.
ఈ విషయాలపై రవాణా శాఖ (RTA), ట్రాఫిక్ పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరుతూ డీజీపీ మరియు రవాణా శాఖ కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు.