చలిగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు
జగిత్యాల, మే 21: చలిగల్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు కేంద్రీయ విద్యాలయానికి ప్రతిపాదించిన స్థలాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మకునూరు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, డైరెక్టర్ జనరల్ వాలంటరీ అనితతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, భవన నిర్మాణం, రహదారి సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, క్రీడా మైదానాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీం, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతరులు పాల్గొన్నారు.