కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు.. తక్షణ చర్యలు తీసుకోవాలని BJP జగిత్యాల పట్టణ శాఖ డిమాండ
జగిత్యాల, మే 21 : రాష్ట్రంలోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, మౌలిక వసతుల కొరత, అలాగే ‘తరుగు – తేమ’ పేరుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, కొనుగోళ్లను వేగవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ డిమాండ్ చేసింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు BJP జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పంట పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుపుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ముందస్తు ప్రణాళిక లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు వంటి సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. అలాగే ‘తరుగు’, ‘తేమ’, ‘తాలు’ పేరుతో రైతులకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని BJP నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, ఉపాధ్యక్షులు ఇట్యాల రాము, గాదాసు రాజేందర్, ఠాగూర్ పవన్ సింగ్, కొప్పు భాస్కర్, కార్యదర్శి మేడిపల్లి పుష్ప రెడ్డి, మహిళా మోర్చా సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.