జగిత్యాల:
రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు మరియు వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రతి వసతి గృహంలో పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు.
అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్, ఆర్డీవో మధుసూదన్, డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు.